హిందీ చలన చిత్ర పరిశ్రమ, దక్షిణ భారత దేశపు సినిమాల ముందు నిలబడలేకపోతోంది. బాలీవుడ్ తమ బలంగా నమ్మే సూపర్ స్టార్ లు, వారి మార్కెటింగ్ నైపుణ్యం, విరివిగా వెదజల్లబడుతున్న డబ్బు ఇవి ఏవీ కూడా చిత్రసీమను బలపరచడం లేదు. తెలుగు చలన చిత్రాల డబ్బింగ్ పరంపర కొనసాగింది దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం. ముంబైలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో, సినిమా క్లైమాక్స్ కి ప్రేక్షకులు అందరూ లేచి ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతున్నప్పుడే ప్రజలు మార్పు కోరుతున్నట్లు అర్థమౌతుంది. 7 ఏళ్ల క్రితం విడుదలైన బాహుబలి మాత్రం లెక్కలను, అనుమానాలను పటాపంచలు చేసెసింది. ఒంటిచేత్తో విజయాన్ని ఆకాశపుటంచు దాకా వెళ్ళి తాకి మరీ వచ్చింది. భారతీయ చలనచిత్ర నిర్మాణంలో విజయానికి సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతాలను మార్చివేసి, బాక్సాఫీస్ను చుట్టివేసిన చిత్రాలలో మొదటిది. CII సౌత్ మీడియా&ఎంటర్టైన్మెంట్ నివేదిక ప్రకారం 2021లో, ఆల్-ఇండియా సినిమా కలెక్షన్లలో 62 శాతం దక్షిణ భారత చిత్రాల నుండి వచ్చాయి. అంతే ఈ ధోరణి మరింత బలపడుతోంది.
కరోనా కారణమా?
“కరోనా మహమ్మారి తరువాత ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో గ్రహించడంలో దక్షిణ భారతదేశ దర్శకులు ముందున్నారు.” ఈ వ్యాఖ్య తప్పు. కరోనాకి ముందే దక్షిణ దేశ సినిమా, దేశ వ్యాప్తంగా విజయాలను మూట గట్టుకొని, తనని తాను నిరూపించుకుంది. అసలు ముప్ఫై దశాబ్దాల కిందనే ఎన్నో సినిమాలు ఉత్తరాన తమ సత్తా చాటినై. రంగీలా, శివ, ముంబై, నాయకన్, శివాజీ, విశ్వరూపం వంటివి ఇందుకు ఉదాహరణలు. ముందుగా బాలీవుడ్ విషయం పరిశీలిస్తే, బాలీవుడ్లో ఫ్లాప్ల వర్షం కురుస్తోంది. రణబీర్ కపూర్ నటించిన షంషేరా, సందీప్ ఔర్ పింకీ ఫరార్, బంటీ ఔర్ బబ్లీ 2, జయేష్భాయ్ జోర్దార్, సామ్రాట్ పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, హీరోపంతి 2 మరియు రన్వే 34 వంటి ఇతర పెద్ద బ్యానర్ చిత్రాలు ప్రేక్షకులను తిరిగి పెద్ద తెరపైకి తీసుకురావడంలో విఫలమయ్యాయి. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ తన ప్రకాశాన్ని కోల్పోవడం ప్రారంభించిందని, కరోనా మహమ్మారి దానిని మరింత తీవ్రతరం చేసిందని నిపుణులు భావిస్తున్నారు. చిత్రం ఏమిటంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఇంకా పెద్ద పెద్ద మీడియా మరియు అడ్వర్టైజింగ్ కంపెనీలు కూడా కారణం కనిపెట్టడంలో విఫలమయినాయి.
నాగ్పూర్కు చెందిన ఫిల్మ్ ఎగ్జిబిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ స్వంతదారు అయిన ఆశీర్వాద్ థియేటర్స్ డైరెక్టర్ అక్షయ్ రాఠి ప్రకారం “చాలా సంవత్సరాలుగా, హిందీ సినిమాలు పట్టణ మరియు ఉన్నత స్థాయికి మారాయి. దక్షిణాన, వారు అవే కథలను ఒక సాధారణ మనిషి అర్థం చేసుకునే విధంగా మరియు ఆనందించే విధంగా చెబుతారు. ఎవరినీ దూరం చేసుకోకూడదు అన్న విషయం మనం నిజంగా వారి నుండి నేర్చుకోవాలి" రాఠీ ప్రకారం దక్షిణ భారతదేశంలో బాలీవుడ్ తారలు తమను తాము ప్రమోట్ చేసుకోలేదు. అయితే వారు తమను తాము బాలీవుడ్ లోనే తమను సరిగ్గా ప్రచారం చేసుకోలేదు అని ఇతర నిపుణుల అంచనా. అంతే కాకుండా అక్షయ రాఠీ తన వాదన కొనసాగింపుగా
“యష్ రాజ్ ఫిల్మ్స్ వంటి పెద్ద స్టూడియోలు తమ చిత్రాలైన ధూమ్, టైగర్ జిందా హై మొదలైన వాటిని తమిళం మరియు తెలుగు డబ్బింగ్ వెర్షన్లలో విడుదల చేస్తాయి. ఈ ప్రయోగాన్ని మరిన్ని హిందీ ఫిల్మ్ స్టూడియోలు మరింత స్థిరత్వంతో కొనసాగించవలసిన అవసరం ఉంది, ”అని అన్నారు. బాబీ ఎంటర్ప్రైజెస్ యజమాని మరియు ఢిల్లీ, యుపి మరియు తూర్పు పంజాబ్ సర్క్యూట్ పంపిణీదారు సంజయ్ మెహతా ఏమి తప్పు జరిగిందో తన అనుభవాన్ని జోడించి ఇలా తెలియజేశారు. “హిందీ సినిమాలకు జనాలతో ఉన్న అనుబంధం తెగిపోయింది. మల్టీప్లెక్స్ లు ఎక్కువ డబ్బును తెచ్చిపెడుతున్నందున వారు మెట్రో-సెంట్రిక్ లేదా ఓవర్సీస్ మార్కెట్ కోసం ఎక్కువ దృష్టి పెట్టారు. సింగిల్ స్క్రీన్ సినిమాల కంటే మల్టీప్లెక్స్ టిక్కెట్ ధరలు చాలా ఎక్కువ. ఈ కారణం వల్ల హిందీ సినిమాలకు సగటు ప్రేక్షకుడికి మధ్యన ఉండే ఆ ఆప్యాయతతో కూడిన సంబంధం తెగిపోయింది. ఈ లోటును ప్రాంతీయ చిత్రాలు అంది పుచ్చుకున్నాయి అన్నారు.
అసలు కారణం:
ఈ కథనాలన్నీ నాణానికి ఒక వైపు మాత్రమే. రెండవ వైపు నిజాలు వాటి రూపు రేఖలు మరొక విధంగా ఉన్నాయి. కరోనా కాలం బాలీవుడ్ కి ఒక చీకటితో కూడిన భయంకరమైన కల కాగా, ఒటీటీ లకు అద్భుతమైన, చేతికందివచ్చిన అవకాశం వంటిది. అంతకు ముందు వరకూ హిందీలో సినిమా పేరిట ఏమి వచ్చినా ప్రేక్షకుడికి గత్యంతరం లేక చూసేవాడు. నచ్చినా నచ్చకున్నా చూడక తప్పదు. అందులో 90% సినిమాలు రీమేక్ లే. అర్జున్ రెడ్డి, కాంచన, ప్రస్థానం, లక్ష్మి బాంబ్, RX 100 ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబీతా తయారౌతుంది. లాక్డౌన్ సమయంలో ఒటీటీలలో పెద్దగా ఊరూ పేరూ లేని దర్శకులు, నటీనటులు అద్భుతమైన కథాకథనాలతో ఇంపైన కంటెంట్ ను అందించిన తీరు ఉత్తరాది ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. తాము ప్రతిరోజూ దర్శించే దృశ్యాలు సినిమా రూపంలో ప్రత్యక్షం కావటం, పేర్లు, కట్టూబొట్టూ, నడివడిక అన్నీ తమ పక్కింటిలో జరుగుతున్న కథలా భావన చెందే అవకాశాన్ని ఈ చిత్రాలు సగటు ప్రేక్షకుడికి అందించాయి. సినిమా అన్నది తన నుండి వేరు కాదు అన్న నిజాన్ని గ్రహించేలా చేశాయి. వీటికి తోడుగా కంటికి ఇంపు కలిగించే దృశ్యాలతో నేల మీద నడిచే కథనాలతో అత్యంత భారీ పెట్టుబడులు పెట్టిన సినిమాలు కూడా అంతే ఆకర్షణ కల్గించి, రాబడి వర్షాన్ని కురిపించాయి. కాంతారా, RRR, పుష్ప(ది రైజ్), సీతారామం, మేజర్, KGF2 ఇత్యాది సినిమాలు ప్రేక్షకుల మనసులను దోచాయి. సగటు ప్రేక్షకుడు హిందీ సినిమాను దక్షిణ భారత దేశ సినిమాను పోల్చి చూడటం మొదలు పెట్టాడు. ఇది బాలీవుడ్ ప్రస్తుతపు అంకానికి తెర పడేట్లు చేసింది.
